పోటెత్తిన భక్తజనం
● కాళేశ్వరం ఆలయానికి
రూ. 5.73 లక్షల ఆదాయం
కాళేశ్వరం: కార్తీమాసం ఆదివారం సెలవురోజు కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారు జామునుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు, దంపతి స్నానాలు చేశారు. గోదావరి మాతకు పూజలు చేశారు. అరటి దొప్పల్లో దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు, దీపాలు వెలిగించారు. దీపారాధనలు చేసి బ్రాహ్మణోత్తములకు దీప దానం చేశారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. సుమారుగా 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా వేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తులు కిక్కిరిసి కనిపించారు. ప్రాకార ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాల ద్వార రూ. 5.73లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు.
పోటెత్తిన భక్తజనం
పోటెత్తిన భక్తజనం


