
మానసిక ఆరోగ్యం ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రమేశ్బాబు
భూపాలపల్లి అర్బన్: శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్ఎంఆర్డీఎస్లోని దివ్యాంగ బాలలతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు అలవాటు పడినవారు, నేరాలకు పాల్పడే వారిలో చాలా మందికి మానసిక ఆరోగ్యం సరిగా ఉండదన్నారు. శరీరంపై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. హియరింగ్, ఎయిడ్స్, హెల్త్ క్యాంపు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, హెచ్ఎంఆర్డీఎస్ సంస్థ నిర్వాహకులు రజిత, రాజయ్య, న్యాయవాదులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘ది హైపోతీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేదస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం గర్వంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో నిట్ అధ్యాపకులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాపక నాగరాజు, ములుగు జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని డీడీ జనార్దన్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో హెడ్ మాస్టర్, సబ్జెక్టు పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. 2013 సంవత్సరంలో అప్గ్రేడ్ అయిన ఏయూపీఎస్ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయాలన్నారు.

మానసిక ఆరోగ్యం ఉండాలి