
ఇందిరమ్మకు ఉపాధి తోడు
ఈజీఎస్తో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
కాటారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూలీల కొరత నివారించి నిర్మాణ పనులు సజావుగా సాగేలా తగు చర్యలు తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేయగా ఉపాధిహామీ అధికారులు గ్రామీణ స్థాయిలో అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారు జాబ్కార్డు కలిగి ఉంటే 90 రోజులు పనిదినాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణాలకు కూలీల కొరత లేకుండా సదరు లబ్ధిదారు పని చేసుకొని కూలి పొందవచ్చు. దీంతో నిర్మాణ పనులు త్వరితగతిన కొనసాగడంతో పాటు లబ్ధిదారు ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి.
90 రోజుల పనిదినాలు..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి ఉపాధిహామీలో జాబ్కార్డు ఉన్న లబ్ధిదారులకు బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ లెవల్ వరకు 50రోజుల పని దినాలు కల్పించనున్నారు. 90 రోజుల పనిదినాలకు సదరు లబ్ధిదారుకు రూ.27,630 చెల్లించనున్నారు. దీంతో సొంతింటి నిర్మాణానికి కూలీ పని చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది.
జిల్లాలో 94 ఇళ్ల గుర్తింపు..
జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద ఇప్పటివరకు 94 ఇళ్లను గుర్తించినట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ స్థాయి, గోడల నిర్మాణం, స్లాబ్ లెవల్ వరకు జరిగిన ఇళ్లను ఎంపిక చేశారు. ఇందులో 72 ఇళ్లకు ఎస్టిమేట్ ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో ఉన్న ఇళ్ల లబ్ధిదారు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా ఇంటి నిర్మాణ పనులకు రోజూ మస్టర్ వేసి కూలీ చెల్లించనున్నారు. జిల్లాలో ఇళ్ల గుర్తింపు జరిగినప్పటికీ స్థానిక ఎన్నికల కోడ్ ప్రభావం వల్ల మంజూరు ప్రక్రియ ఇంకా మొదలవలేదు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉపాధిహామీ పథకాన్ని వినియోగించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి గుర్తించాం. ఎంపిక చేసిన ఇళ్లకు ఎస్టిమేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. స్థానిక ఎన్నికల కారణంగా ఇంకా మంజూరు పత్రాలు ఇవ్వలేదు.
– బాలకృష్ణ, డీఆర్డీఓ
90 రోజులు పనిదినాలు కల్పించేలా చర్యలు
నిర్మాణ పనుల వేగవంతానికి
సర్కారు కసరత్తు