పరీక్షతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం
జనగామ: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పారదర్శకతకు పెద్దపీట వే స్తూ మెరిట్ ఆధారిత ఎంపికలను అమలు చేస్తున్నారు. గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగా ల భర్తీలో పైరవీలు, సిఫార్సులు, డబ్బు లావాదేవీలపై ఆరోపణలు వినిపించేవి. అయితే ప్రస్తుత కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగాలకు తప్పనిసరి గా రాత పరీక్ష నిర్వహిస్తూ, అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులనే ఎంపిక చేయడం ద్వారా నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చారు.
పరీక్షతో భర్తీ
జిల్లాలో ఇప్పటి వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ, వైద్యారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, వైద్య, విద్యాశాఖ, భూ సేకరణ, డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం తదితర శాఖల్లో ఐదు నోటిఫికేషన్లు జారీ చేసి మొత్తం 45 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. ప్రతీ నోటిఫికేషన్కు రాత పరీక్ష నిర్వహించి, అదే రోజు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెబ్సైట్లో వెల్లడించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. వారం రోజుల్లోనే నియామక ఉత్తర్వులు జారీ చేసి అభ్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 564 మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్నారు. ఆయా ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్నా యా, కార్యాలయాలు నిర్వహిస్తున్నాయా అనే అంశాలపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఒకటో తేదీనే వేతనాలు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నెల ఒకటో తేదీన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏజెన్సీలు వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తే, వాటి డిపాజిట్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నారు. అవసరమైతే సంబంధిత ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా కలెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖలో ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారులు, వైద్యారోగ్య శాఖలో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక సూపర్వైజర్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 18 మంది బోధనా సిబ్బంది, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వంట మనుషులు, సహాయ వంట మనుషులు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో చైన్మన్, స్వీపర్, అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులను పూర్తిగా రాత పరీక్ష ద్వారా భర్తీ చేశారు.
మెరిట్కే ఉద్యోగం, వారం రోజుల్లో నియామకం
కలెక్టర్ చర్యలతో పారదర్శకంగా భర్తీ
ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా


