జనగామ రూరల్: జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం సీసీ కెమెరా వ్యవస్థ ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, ఈడీఎం గౌతమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పాల ఉత్పత్తి తగ్గకుండా చూడాలి..
పాల ఉత్పత్తి తగ్గకుండా శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు పాటించాలని పాడి పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని చాంబర్లో పశుసంపదపై ఎల్నినో ప్రభావ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో హీట్ స్ట్రెస్ పెరిగి, ఆహార గ్రహణం తగ్గడంతో పాల ఉత్పత్తి తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. పచ్చిక కొరత వల్ల పోషకాహార లోపాలు ఏర్పడడంతో పాటు నీటి కొరత కారణంగా పశువుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. డీవీహెచ్ఓ మురళీధర్ రావు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన బోధనతోనే ఉత్తమ ఫలితాలు
పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల): నాణ్యమైన బోధనతోనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దేవరుప్పల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, యునిఫాం కుట్టుపనులు పరిశీలించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


