ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

హసన్‌పర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌ను సోమవారం కమిషనర్‌ సందర్శించారు. ఈసందర్భంగా స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ పుష్పగుచ్ఛంతో కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించడంతో పాటు విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. కమిషనర్‌ శ్వేత మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన వారికి రసీదు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఎస్సై దేవేందర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రీజినల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ప్రవేశాలకు ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న రీజనల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ప్రవేశాలకు సోమవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. జేఎన్‌ స్టేడియంలో కొనసాగిన ఎంపికలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఎంపికలు కొనసాగుతాయని హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ తెలిపారు. జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌, రెజ్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌ క్రీడాంశాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపికల ప్రక్రియను సాట్‌ అబ్జర్వర్లు సతీశ్‌రెడ్డి, జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ దీపక్‌ ప్రసాద్‌, హ్యాండ్‌బాల్‌ కోచ్‌ సుధాకర్‌ యాదవ్‌, రెజ్లింగ్‌ కోచ్‌ సంతోశ్‌చారి పర్యవేక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి తరానికి ఏసిరెడ్డి

నర్సింహారెడ్డి ఆదర్శం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్‌

జనగామ రూరల్‌: ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే ఏసిరెడ్డి నర్సింహారెడ్డి నేటి తరానికి ఆదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్‌ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఏసిరెడ్డి నగర్‌లో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఏసి రెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్‌ మాట్లాడారు. యువత ఏసిరెడ్డి బాటలో నడవాలన్నారు. అనంతరం క్రీడల్లో, చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు. జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, కౌన్సిలర్‌ బూడిద జ్యోతి గోపి, ఎండీ దస్తగిరి, సుంచు విజేందర్‌, భూక్య చందు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచే గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement