జనగామ రూరల్: జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 410 ధరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు శాఖల వారీగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సేవలను సమర్థవంతంగా అందించాలంటే వారికి జీతాలు సకాలంలో అందడం అత్యంత అవసరమన్నారు. ప్రతీ శాఖ అధికారి తమ పరిధిలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన బిల్లులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఇలా..
● జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన కె.రాజేశ్వరి తనకు ఇంటి స్థలం లేదని, కిరాయి ఇంటిలో ఉంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి అందజేశారు.
● కొడకండ్ల మండలం, ఏడునూతుల గ్రామానికి చెందిన పల్లె రంగయ్య, తనకు మొత్తం 3.28 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిని వెంకటయ్య, రాములు, సోమన్న, వీరసోములు దొంగ కాగితాలు సృష్టించి పట్టా చేసుకొని, వేరే వారికి విక్రయించారని, విచారణ చేసి భూమిని తన పేరు మీదకు పట్టా చేయాలని కోరారు.
కలెక్టర్ సందీప్కుమార్ ఝా
ప్రజావాణిలో 410 దరఖాస్తులు


