● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం రవాణాకు సరిపడా అదనపు ట్రాక్టర్లు, లారీలను కేటాయించాలని సూచించారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ భాస్కర్, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, జిల్లా డీసీఎస్ఓ సురేష్రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ ఉన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలను
కట్టుదిట్టంగా నిర్వహించాలి
జిల్లాలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 5 నుంచి 12 వరకు జరిగే పది సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా కేంద్రంలోని స్టేషన్రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఏసీపీ భీం శర్మ, ఏసీజీఈ సత్యనారాయణ, జీసీడీఓ గౌసియా బేగం, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. శనివారం మండలంలోని పటేల్గూడెం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.


