బోగస్‌ పింఛన్లకు ఇక చెక్‌! | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ పింఛన్లకు ఇక చెక్‌!

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

జనగామ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా వెనకబడి ఆదరణ లేని వృద్ధులు, వితంవులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పింఛన్‌ డబ్బులు లబ్ధిదారుల పోస్టల్‌, బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారు. పోస్టల్‌ అకౌంట్లలో జమవుతున్న లబ్ధిదారులకు సంబంధిత ఏరియా పోస్టుమన్‌ బయోమెట్రిక్‌ లేదా ఫేస్‌ రికగ్నేషన్‌ యాప్‌లో క్యాప్చర్‌ చేసి పింఛన్‌ డబ్బులు అందిస్తున్నారు. ఈ విధానం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇక పట్టణ, మండల కేంద్రాల్లో లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో జమవుతోంది. వీరు ఏటీఎం ద్వారా లేదా బ్యాంక్‌కు వెళ్లి నగదు నేరుగా తీసుకుంటున్నారు. లబ్ధిదారులు మృతిచెందినా వారి ఖాతాలో డబ్బులు జమవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇందుకు లబ్ధిదారులను నిర్ధారించేందుకు లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ చేపడుతున్నారు. మెప్మా, డీఆర్‌డీఏ సిబ్బంది పెన్షన్‌దారుల ఇంటికి వెళ్లి ముఖగుర్తింపు (ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టం) ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుల్లో జరుగుతుండగా అన్ని గ్రామాల్లో చేపట్టనున్నారు. జనగామ మున్సిపాలిటీలో 6,882 మంది లైవ్‌ అథెంటికేషన్‌ చేసుకోవాల్సి ఉంది. ఇందులో మూడు రకాల వారు ఉంటారు. హెచ్‌ఐవీ, ఫైలేరియా, డయాలసిస్‌ రోగులు ఉంటారు. గ్రామాల్లో 816 మంది ఉన్నారు. తప్పకుండా లైవ్‌ అథెంటికేషన్‌ చేసుకోవాలి. చేసుకోకుంటే పెన్షన్‌ నిలిచిపోయే అవకాశం ఉంది.

సమాచారం అందించాలి..

పెన్షన్‌ పొందే వ్యక్తి మృతి చెందితే సదరు కుటుంబ సభ్యులు పింఛన్‌ నిలిపివేయాలని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌కు, గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. సంబంధిత అధికారులు జిల్లా గ్రామీణభివృద్ధిశాఖకు సమాచారం అందించి పెన్షన్‌ నిలిపివేస్తారు. కాని ఎలాంటి నిబంధనలు అమలు కావడం లేదు. సమాచారం ఇవ్వకుండా పింఛన్‌ డబ్బుల ను ఏటీఎం లేదా ఫోన్‌పే, గూగుల్‌ పే త దితర వాటి ద్వారా పొందుతున్నట్లు తె లుస్తుంది. ఇందుకుగాను బోగస్‌ పింఛన్ల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

ప్రత్యేక యాప్‌తో గుర్తింపు

చేయూత లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించారు. సీబీఎస్‌(కోర్‌ బ్యాంక్‌ సిస్టం) తో నిబంధనల ప్రకారం లాగిన్‌ ఐడీతో యాప్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. పింఛన్‌దారుడి ఐడీ లేదా ఆధార్‌ నంబర్‌ ఎంట్రీ చేసిన తర్వాత వివరాలు వస్తాయి. ఆ వివరాలను నిర్ధారించుకొని పింఛన్‌దారుడి ముఖాన్ని కెమెరా ద్వారా (లైవ్‌ అథెంటికేషన్‌) ప్రత్యక్ష ధ్రువీకరణ చేస్తున్నారు. పెన్షన్‌ పొందుతున్న ప్రతీ లబ్ధిదారుడు ప్రత్యక్ష ధ్రువీకరణ చేయించుకో వాల్సిందే. ఈ సర్వే జనగామ మున్సిపాలిటీలో ప్రారంభమైంది. ఇంటింటి సర్వే సమయంలో పింఛన్‌ దారుడు స్థానికంగా అందుబాటులో లేకపోతే వారం రోజుల గడువు ఇస్తున్నారు.

లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ

తప్పనిసరి

ప్రత్యేక యాప్‌తో

అధికారుల ఇంటింటి సర్వే

లైవ్‌ అథెంటికేషన్‌

చేయించుకోవాలని విజ్ఞప్తి

జిల్లా వ్యాప్తంగా 74,993మంది పింఛన్‌ లబ్ధిదారులు

జిల్లావ్యాప్తంగా మొత్తం

పింఛన్‌ దారులు: 74,993

నెలవారీగా బడ్జెట్‌:

రూ.18,90,85,776

వృద్ధులు: 30,031

వితంతువులు: 25,414

దివ్యాంగులు: 10,225

బీడీ కార్మికులు: 2,058

గీత కార్మికులు: 2,792

చేనేత కార్మికులు: 1,447

ఒంటరి మహిళలు: 1,475

హెచ్‌ఐవీ బాధితులు: 730

ఫైలేరియా బాధితులు: 706

డయాలసిస్‌ పేషెంట్లు: 1,015

Advertisement
 
Advertisement
Advertisement