జనగామ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం మొదటి రోజే యూనిఫామ్, షూస్, బెల్ట్లు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్కారు ఆదేశాలతో ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 481 ప్రభుత్వ ఉన్నత, ప్రాథ మికోన్నత, ప్రాథమిక, మోడల్, కేజీబీవీ, ఇతర గురుకులాల పాఠశాలల్లో సుమారు 37 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండు జతల చొప్పున 74 వేల యూనిఫాంలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ నోడల్ ఏజెన్సీకి యూనిఫామ్ స్టిచ్చింగ్ బాధ్యతలు అప్పగించగా, రెండు నెలల క్రితమే డీఆర్డీఓ పర్యవేక్షణలో సెర్ప్ ఆధ్వర్యంలో విద్యార్థుల కొలతలు తీసి ప్రభుత్వానికి పంపించారు. కేజీబీవీ విద్యార్థులకు అదనంగా వైట్ యూనిఫామ్, ఇతర వసతి గృహాల విద్యార్థులకు అదనపు యూనిఫామ్లు అందించనున్నారు.
జూన్ 12న పంపిణీ..
విద్యార్థులకు రెండో జత యూనిఫామ్ కూడా జూన్ నెలాఖరులోపే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రెసిడెన్షియల్ విద్యార్థులకు నైట్ డ్రెస్, పీటీ డ్రెస్, ట్రాక్సూట్, ప్లేట్, గ్లాస్ కూడా సరఫరా చేస్తారు. గతంలో యూనిఫామ్ ఆలస్యం, నాసిరకం కుట్టు, సైజు సమస్యలపై విమర్శలు రాగా, ఈసారి ప్రతీ మండలంలో ఎంఈఓ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. హెచ్ఎంలు స్వయంగా సైజు, కుట్టు, నాణ్యత చెక్ చేసిన తర్వాతే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. లోపాలుంటే 48 గంటల్లో మార్చి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 23 సాంఘిక సంక్షేమ గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు, కేజీబీవీలు ఉన్నాయి.
పౌష్టికాహారంపై ఫోకస్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పాలు, రాగి జావ అందించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో సర్కారు బడులు, గురుకులాలకు వచ్చే పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. నాణ్యతలేని వస్తువులు సరఫరా చేస్తే ఏజెన్సీలను బ్లాక్లిస్ట్ చేస్తామని సర్కారు హెచ్చరించింది.
సర్కారు బడి విద్యార్థులకు శుభవార్త
జిల్లాలో 481 పాఠశాలలు...
37వేల మంది పిల్లలు


