● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: సురక్షిత మాతృత్వానికి సమయానుకూల సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (బలమైన బాల్యానికి 1000 మెట్లు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం ముందస్తు నమోదు, క్రమబద్ధమైన పరీక్షలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, సీడీపీఓలు మణెమ్మ, విజయ, చంద్రిక, శోభారాణి, సూపర్ వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా
జనగామ రూరల్: విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని టాస్క్ఫోర్స్ ద్వారా సంయుక్త తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో ఈనెల 31న నిర్వహించనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేపట్టే వివిధ కార్యక్రమాలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీపీఓ వెంకట్రెడ్డి, డీఏఓ అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.


