స్టేషన్ ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు(శుక్రవారం) కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం అర్హత, ఆసక్తి ఉన్న వారి నుంచి గత నెల 27 నుంచి ఈనెల 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మున్సిపల్లో మొత్తం నాలుగు కోఆప్షన్ స్థానాలు ఉన్నాయి. అందులో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కల్గి ఉన్న జనరల్ కేటగిరిలో ఇద్దరు కోఆప్షన్ సభ్యులుంటారు. కాగా వీరిలో తప్పనిసరిగా ఒకరు మహిళ అయి ఉండాలి. అదేవిధంగా మైనార్టీ కేటగిరిలో రెండు స్థానాలు ఉండగా అందులోనూ ఒకరు మహిళ ఉండాలి. అయితే మొత్తంగా కోఆప్షన్ సభ్యుల కోసం 18 దరఖాస్తులు రాగా అందులో స్క్రూట్నీలో రెండు తిరస్కరించబడగా ప్రస్తుతం 16 మంది బరిలో ఉన్నారు. ఇందులో జనరల్ కేటగిరి కోఆప్షన్ కోసం 10 మంది దరఖాస్తు చేసుకోగా అందులో బీసీలు–5గురు, ఎస్సీలు–3, ఓసీలు–ఇద్దరు ఉన్నారు. మైనార్టీ కోఆప్షన్ కోసం ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు.
ఎవరి ధీమా వారిదే
కోఆప్షన్ సభ్యుల స్థానంపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రసన్నం చేసుకునేందుకు పలుమార్లు ఆయన వద్దకు వెళ్తూ ఆశీస్సుల కోసం తాపత్రయపడుతున్నారు.
నలుగురు సభ్యుల ఎన్నికపై ఉత్కంఠ
నేడు ఘన్పూర్ మున్సిపాలిటీ
కౌన్సిల్ సమావేశం


