సభల్లో చర్చించే ముఖ్యాంశాలు:
కొడకండ్ల మండలంలో
మట్టి నమూనాల సేకరణ
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన స్కీంలను ప్రజలకు వివరించేందుకు అధికారుల గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల బాట పడుతున్నారు. ప్రజా పాలనను మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు(గురువారం) జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డుసభలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల పురోగతిని గ్రామ, వార్డు స్థాయికి చేరువ చేయడం, కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ చర్యలను ప్రజలకు వివరించడం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 281 జీపీలు, జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీల్లోని 48 వార్డుల్లో పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
సభల్లో ఇలా..
గృహ నిర్మాణ, సంబంధిత పథకాలతో పాటు అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తారు. దీంతో పాటు పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ ఇళ్ల నిర్మాణ నాణ్యత, దశల వారీ సహాయాల విడుదలకు సంబంధించి లబ్ధిదారులకు పథకం గురించి వివరిస్తారు. రైతులకు సంబంధించిన పథకాలు సాగు సౌకర్యాలు, పంటల కొనుగోలు, నీటి పారుదల సమస్యల పరిష్కారం, యాసంగి సీజన్ సన్నాహక చర్యలపై అవగాహన కల్పిస్తారు. సామాజిక సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందనే దానిపై ఆయా శాఖల అధికారులు నివేదిక వినిపిస్తారు. పింఛన్ల మంజూరు, పెరుగుదల, పెండింగ్ కేసుల విచారణ, అభ్యర్థుల ధ్రువీకరణ ప్రక్రియ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రత్యేక సేవలపై గ్రామసభలో తెలియ జేయనున్నారు.
విద్య, ఆరోగ్య సేవల్లో..
పాఠశాలల అభివృద్ధి, బడిబాట కార్యక్రమాలు, గ్రామ, పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవలు, వైద్య శిబిరాలు, గర్భిణులు, చిన్నారులకు పోషకాహార పథకాలపై ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సంబంధించి సభల్లో ప్రజెంటేషన్ చేయడంతో పాటు ప్రజల నుంచి నేరుగా సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.
పథకాలపై అవగాహన
రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, సన్నరకం ధాన్యం కొనుగోలుపై బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి(2వందల యూనిట్లకు ఉచిత విద్యుత్), కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కొత్త రేషన్ కార్డు మంజూరుపై అవగాహన కల్పిస్తారు.
గత 99 రోజుల్లో ప్రజాపాలనలో చేపట్టిన చర్యల వివరాలు
గ్రామ, పట్టణ వార్డు స్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాల సమీక్ష
కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల పరిచయం
లబ్ధిదారుల ఎంపిక విధానం, అర్హతలు
గ్రామ, వార్డు అభివృద్ధి పనులు, నిధుల వినియోగం
ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరణ
ప్రభుత్వ పథకాల వివరాలు వివరిస్తారు.
2024–25 సంవత్సరానికి కొడకండ్ల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి విస్త్రతంగా వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని 4,250 మంది రైతుల వ్యవసాయ భూముల నుంచి మట్టి నమూనాలు సేకరించి, వాటికి సంబంధించిన పరీక్ష ఫలితాలను సిద్ధం చేశారు. ఈ మట్టి నమూనాల రిపోర్టులను జరిగే గ్రామసభల్లో సంబంధిత రైతులకు అందజేయనున్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో, గ్రామానికి 10 చొప్పున మొత్తం 1,760 మట్టి నమూనాలు సేకరణ పూర్తి చేశారు. ఈ నమూనాలను పరీక్షల కోసం రాజేంద్రనగర్ మట్టి నమూనా పరీక్ష కేంద్రానికి పంపించారు. వీటి ఆధారంగా సర్టిఫికెట్లు త్వరలో విడుదల కానున్నాయి.
నేడు గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించనున్న ప్రభుత్వం
సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్ష
కొత్త స్కీంలపై అవగాహన
కొడకండ్ల రైతులకు మట్టి నమూనా సర్టిఫికెట్లు


