జనగామ: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరగడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులపై భారం మరింత పెరిగింది. 15 రోజుల క్రితం రూ.60లు పెరిగిన ధరను మరోసారి రూ.215 మేర బాదడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,327కు చేరింది. కేవలం రెండు వారాల్లోనే రూ.275 పెరుగుదల నమోదవడంతో టీ స్టాల్స్, చిన్న హోటల్స్, చిరు వ్యాపారులపై అదనపు భారం కానుంది. జిల్లాలో అన్ని కేటగిరీలను కలుపుకుని 800 నుంచి 1,500 వరకు హోటల్స్, ఫుడ్ అవుట్లెట్లు ఉన్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 30 శాతం కూడా లేవు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసే వారు కొందరైతే, అత్యధిక సంఖ్యలో సబ్సిడీ సిలిండర్లతో వ్యాపారం చేస్తున్నారు. దీనిపై సివిల్ సప్లయీస్ అధికారులు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం కారణంగానే కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.
సప్లై ప్రారంభం
15 రోజులుగా సరఫరా నిలిచిన కమర్షియల్ సిలిండర్లు ఒకటి, రెండు రోజులుగా తిరిగి అందుబాటులోకి రావడంతో ఏజెన్సీలు కొత్త ధరలకే సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలో హోటల్ నిర్వాహకులు రోజూ ఎన్ని సిలిండర్లు కొనుగోలు చేశారనే లెక్కపై సుమారు 60 శాతం మేరకు మాత్రమే ఇప్పుడు విక్రయాలు జరుపుతున్నట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. వ్యాపారం తగ్గిన పరిస్థితుల్లో మరింత భారం మోసే పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళన హోటల్ వ్యాపారుల్లో నెలకొంది. కాగా, కమర్షియల్ గ్యాస్ సప్లై పునఃప్రారంభం కావడంతో బడా హోటల్ యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
● హోటల్ వ్యాపారులపై పెను భారం
సిలిండర్పై రూ.215 పెంపు


