● లక్ష్యాన్ని చేరేవరకు కృషి చేయాలి..
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: ‘చదువులో ఎప్పుడూ రాజీపడొద్దు.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపకుండా కృషి చేయాలి’ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు సందేశం అందించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన అకస్మికంగా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం, వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించి, లోపాలుంటే వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, హాజరు రిజిస్టర్లు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థుల ప్రగతి గురించి తెలుసుకున్నారు.
టీచర్గా మారిన కలెక్టర్..
కలెక్టర్ స్వయంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. 5 నుంచి 10వ తరగతి వరకు బోధన విధానం, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల ప్రగతిని పరిశీలించి, 9వ తరగతి విద్యార్థులకు గణితంలోని మౌలిక అంశాలపై సులభంగా అర్థమయ్యే పద్ధతిలో బోధించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ మీరు నిర్ణయించుకున్న లక్ష్యం ఎలాంటిదైనా, క్రమశిక్షణ, కష్టపడి చదవడం, దృఢ సంకల్పం ఉంటే ఎవరూ ఆపలేరన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై బోధనలో నాణ్యత పెంచాల్సిన అవసరాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


