భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ బెన్షాలోమ్
కొడకండ్ల : భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూముల రీసర్వే, ఓటరు జాబితా సవరణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీసర్వే కోసం మండలంలో రామవరం, నర్సింగాపురం గ్రామాలను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. తహసీల్దార్ చంద్రమోహన్ పాల్గొన్నారు.
లింగంపల్లి జాతర హుండీల ఆదాయం రూ.7.14లక్షలు
చిల్పూరు: మండలంలోని లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల ఆదాయం రూ.7,14,500లు వచ్చినట్లు ఈఓ చిందం వంశీ, చైర్మన్ కండ్లకోలు శ్రీనివాస్ తెలిపారు. జాతర ప్రాంగణంలోని రైతు వేదికలో సోమవారం 11 హుండీల లెక్కింపును రాత్రి 7 గంటల వరకు కొనసాగించారు. మొదటి రోజు రూ.7.14 లక్షల ఆదాయం రాగా బెల్లం అంటిన నోట్లు, చిల్లర లెక్కింపు మిగిలి ఉందని మంగళవారం లెక్కింపు పూర్తి చేయనున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై నవీన్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఏదునూరి రవీందర్, కండ్లకోలు బాలరాజు, మామిడాల బాలరాజు, కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.
ఇప్పగూడెం జాతర..
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం, రంగరాయగూడెం, అక్కపెల్లిగూడెం, కోమటిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని చింతగట్టు శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర హుండీ ఆదాయం మొత్తం రూ.4,15,347 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈఓ లక్ష్మీప్రసన్న, జాతర కమిటీ చైర్మన్ తోట వెంకన్న తెలిపారు. జాతర ప్రాంగణంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, దేవాదాయ శాఖ అధికారులు, జాతర కమిటీ బాధ్యులు, వివిధ కులపెద్దల ఆధ్వర్యంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం ఆదాయం రూ.4,15,347 వచ్చాయని, అదేవిధంగా కిర్గిస్తాన్ దేశానికి చెందిన కరెన్సీ 120 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జాతర కమిటీ మాజీ చైర్మన్ మందపురం ఎల్లగౌడ్, జాతర వైస్ చైర్మన్ మ్యాదరబోయిన కరుణాకర్, సర్పంచ్లు శిరీష్రెడ్డి, రాణిఅనీల్, సోమేశ్వర్, లక్ష్మణ్, నాయకులు కత్తుల కట్టయ్య, మునిగెల రమేశ్, కత్తుల రంజిత్, అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్సీల్లో ప్రసవాల
సంఖ్య పెంచాలి
లింగాలఘణపురం: సురక్షిత మాతృత్వం, మెరుగైన మాతృశిశు ఆరోగ్యం కోసం పీహెచ్సీల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో ఈ నెలలో జరిపిన ప్రసవాలపై, సబ్సెంటర్లు, ఏఎన్ఎంలతో ఎంఎన్హెచ్పై సిబ్బందితో సమీ క్షించారు. అదేవిధంగా లాబ్టెక్నీషియన్, ఫార్మసిస్టుల పనితీరును తెలుసుకున్నారు. ఆయనతో పాటు వైద్యాధికారి ఉదయ్కిరణ్, స్వర్ణలత, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్
పోటీలకు తేజశ్రీ
లింగాలఘణపురం : మండలంలోని వనపర్తి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆసర్ల తేజశ్రీ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ విష్ణుమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు.
భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి
భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి
భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి


