మహాజాతరకు ప్రత్యేక బస్సులు
జనగామ ప్రెస్టన్ మైదానం, స్టేషన్ఘన్పూర్లో పాయింట్
● నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం బస్సు సర్వీసులు
● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
● డీఎం స్వాతి
జనగామ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాకపోకలు సులభతరం చేసేందుకు జనగామ ఆర్టీసీ డిపో ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రెస్టన్ మైదానం, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి మేడారం పుణ్యక్షేత్రానికి ఈ నెల 31వ తేదీ వరకు మొత్తం 130 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. జాతర సమయంలో భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రెస్టన్ మైదానంలో ప్రత్యేక తాత్కాలిక బస్టాండ్, టికెట్ కౌంటర్లు, వేచివుండే షెడ్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్టాండ్ను నేటి(ఆదివారం) ఉదయం అధికారికంగా ప్రారంభించనున్నారు. రాత్రి వేళల్లో కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా విద్యుత్ వెలుగులు, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ను నియంత్రించే ప్రత్యేక చర్యలు తీసుకుని బస్సుల రాకపోకలు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
టికెట్ ధరలు
జనగామ, స్టేషన్ఘన్పూర్ పాయింట్ల నుంచి ఎక్స్ప్రెస్, డీలక్స్ ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరలను నిర్ణయించారు. జనగామ పాయింట్ నుంచి మేడారానికి ఎక్స్ప్రెస్ సర్వీసులో పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.250, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.330, పిల్లలకు రూ.200, డీలక్స్ సర్వీసుల్లో జనగామ పాయింట్ నుంచి పెద్దలకు రూ.460, పిల్లలకు రూ.280, స్టేషన్ఘన్పూర్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.380, పిల్లలకు రూ.220గా నిర్ణయించారు.
మహాజాతరకు ప్రత్యేక బస్సులు


