
కొత్తగా ఉపాధి
ఇకనుంచి మారనున్న ప్రాధాన్యపనులు
సీజన్లకు అనుగుణంగా..
జనగామ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈనెల 2వ తేదీ నుంచే చేపట్టాల్సి ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో జిల్లాలో ఈ నెలలో గ్రామసభల ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించనున్నారు. మట్టి పనులను తగ్గించి ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ప్రధానంగా బిల్డింగులు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు, కిచెన్షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులు గుర్తించాలి. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామపంచాయతీలు ఉండగా అన్నింటా గ్రామసభలు నిర్వ హించడానికి ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు 58 రకాల పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్కు, ఆ తర్వాత జిల్లాకు పంపించి అనుమతులు తీసుకోవాలని అధికారులు తలపోస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు.
ఉపాధి పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పూడికతీత పనుల్లో అక్రమర్కులకు మరింత లాభం చేకూరేలా ఉంటుంది. ఉపాధి హామీ పనులపై నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను ఈ పూడికతీత పనుల అంచనాల తయారీని తగ్గించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లాలో 281 గ్రామాల్లో పనులు నడుస్తున్నాయి. మొత్తం 1,17,806 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. ఈ జాబ్కార్డుల్లో మొత్తం 2.31లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యాక్టివ్ జాబ్ కార్డులు 77,788 ఉండగా వారిలో 1,28,436 మంది యాక్టివ్ కూలీలకు12,94,056 పని దినాలు కల్పించారు.
జీపీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఇసుకమేటల తొలగింపు..
ఇందిరమ్మ ఇళ్లు, పొలంపనుల్లో కూలీల సహాయం కోసం ప్రణాళిక
ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే అవకాశం
పనుల గుర్తింపునకు గ్రామసభల
నిర్వహణ
58 రకాల ఉపాధి హామీ పనులు
చేపట్టాలని నిర్ణయం
గ్రామసభల్లో సీజన్లకు అనుగుణంగా ఉపాధి పనులు గుర్తిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కూలీల సహాయాన్ని తీసుకోనున్నారు. అలాగే పంటపొలాల్లో కూలీలతో ఇసుక మేటలు తొలగించనున్నారు. వ్యవసాయ పనులు మెండుగా ఉండే రోజుల్లో కూలీలు తక్కువ సంఖ్యలో హాజరవుతుంటారు. ఆ పనులు లేని సమయంలో అధిక మందికి పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొంది స్తుంటారు. జిల్లాలో కొన్నాళ్లుగా ఎక్కువగా భూగర్భజలాల పెంపునకు సంబంధించిన పనులకే ప్రాధాన్యమిస్తున్నారు. చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, కాలువల్లో పిచ్చిమొక్కలు, నీటి కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం, మొక్కలు, పండ్ల తోటల పెంపకం వంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు.