
సీపీఆర్పై అవగాహన
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రీసస్సిటేషన్)పై గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు పారా మెడికల్, బోధనా సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ నాగమణి మాట్లాడుతూ.. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు సమయానికి సరైన సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి చేతివాటం సాధన చేసే అవకాశం కూడా కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.
రేపటి బీసీబంద్కు
‘చాంబర్’ మద్దతు
జనగామ రూరల్: స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జనగామ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ సేవెల్లి సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్యను కలిసి, బంద్కు మద్దతు తెలపాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంద్కు విద్యా, వ్యాపార సంస్థలు, హోటళ్లు, మద్యం దుకాణాలు సహా సమాజంలోని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య మాట్లాడుతూ.. చాంబర్ తరఫున బీసీ బంద్కు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. దూడల సిద్ధయ్య, జాయ మల్లేష్, పండుగ హరీశ్, మాచర్ల భిక్షపతి, పాశం శ్రీశైలం పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయాన్ని తెలపాలి..
జనగామ: దేశం స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతుందని దీనిపై రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి అన్నారు. గురువారం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్లో పలువురితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాసర్వేలో భాగంగా పలు క్యూర్ కోడ్లను ఇచ్చారని దేశ అభివృద్ధి గురించి ఈ యాప్ ద్వారా అభిప్రాయాలను పంపించాలని, తెలంగాణ రైజింగ్–2047లో రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగస్వాములు కావొచ్చని, పలు అంశాలపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మకుంట పనుల పరిశీలన
జనగామ రూరల్: పట్టణంలోని బతుకమ్మకుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మట్లాడుతూ..తుదిదశకు వచ్చిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, మున్సిపల్ కమిషనర్, మెప్మా తదితర శాఖల అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు.
● ఇప్పటికే రూ.205 కోట్లు మంజూరు చేసిన సర్కార్
సాక్షి, వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయం భూసేకరణకు మరో రూ.90 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలో 696.14 ఎకరాలు ఉండడంతో అదనంగా కావాల్సిన 253 ఎకరాల కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు ఇచ్చింది. భూ పరిహారానికి అదనంగా రూ.112 కోట్లు అవసరం ఉండగా, ఇప్పుడు రూ..90 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇప్పటివరకు భూసేకరణ కోసం రూ.295 కోట్లు మంజూరు చేసినట్లయ్యింది. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు.
సత్వర న్యాయం అందించాలి
హసన్పర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. హసన్పర్తి పోలీస్స్టేషన్ను గురువారం సీపీ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్స్టేషన్ ఆవరణను పరిశీలించి స్టేషన్ పరిఽధిలోని సమస్యత్మాక గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు.