
బతుకమ్మకుంటను సిద్ధం చేయాలి
జనగామ రూరల్: బతుకమ్మకుంట అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి బతుకమ్మకుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోటి 50 లక్షల రూపాయలతో ప్రారంభించిన బతుకమ్మకుంట అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగతా పనులు కూడా త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు, చిన్నారులకు టీ, కాఫీ, స్నాక్స్లాంటివి అందుబాటులో ఉండేలా ఎస్హెచ్జీ వారితో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, శ్రీధర్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
నేడు ‘పీఎం ధన్–ధాన్య కృషి యోజన’ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి వ్యవసాయ, గ్రామీణభివృద్ధి, మత్స్య, కో ఆపరేటివ్ తదితర శాఖల అధికారులతో గ్రామ, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ గూగుల్ మీటింగ్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదలు, యువత, రైతులు, మహిళల జీవితాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. వ్యవసాయం మాత్రమే కాకుండా మత్స్యసంపద, పశుసంవర్ధకం తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్కేల్, టెక్నాలజీ, సంస్థాగత బలాన్ని పెంచి.. తద్వారా సమగ్ర అభివృద్ధి సాధించడం లక్ష్యమన్నారు. ఈపథకం కింద జిల్లా ఎంపికై ందని, 6 సంవత్సరాల వరకు అమలయ్యే ఈ పథకంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టే వివిధ రకాల కార్యకలాపాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నమన్నారు. ప్రారంభోత్సవ వేడుకలు కలెక్టరేట్లో జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ వసంత, జిల్లా కోఆపరేటివ్ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల పనితీరు
మెరుగుపర్చాలి
అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చాలని ముఖ్యంగా గర్భిణులు, పిల్లల హాజరుశాతం పెరగాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కందిపప్పు, గుడ్లు, బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. క్లస్టర్ వారీగా సమావేశాలు ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరు మెరుగుపరిచేందుకు అవగాహన కల్పించాలన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్.బి.ఎస్.కె.డాక్టర్ అశోక్, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని అందించాలన్నారు. సంబంధిత రైతుల బ్యాంకు వివరాలను సేకరించేందుకు వచ్చే సోమవారం నుంచి శుక్రవారం వరకు గ్రామ పరిపాలన అధికారులచేత స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.