ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక! | - | Sakshi
Sakshi News home page

ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!

Oct 11 2025 6:16 AM | Updated on Oct 11 2025 6:16 AM

ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!

ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!

‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్‌

నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు

ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ.. 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ

ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్‌తో పరిశీలకుల భేటీ

నవంబర్‌ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా ?

పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ఖరారుపై ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు..

వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్‌కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్‌ (హనుమకొండ, వరంగల్‌), జాన్సన్‌ అబ్రహం (ములుగు, జేఎస్‌ భూపాలపల్లి), దేబాసిస్‌ పట్నాయక్‌ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదేవిధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు గాలి అనిల్‌కుమార్‌, దుర్గం భాస్కర్‌, మక్సూద్‌ అహ్మద్‌, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్‌ యూసుఫ్‌ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్‌ ముదిరాజ్‌, జనగామ, మహబూబాబాద్‌లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్‌, పీసరి మహిపాల్‌ రెడ్డి, కె.శ్రీకాంత్‌జాదవ్‌, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

పోటాపోటీగా ఆశావహులు..

● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది.

● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తధ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్‌, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది.

● వరంగల్‌ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్‌, ఎంపీ ఆనంద్‌, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్‌, నల్గొండ రమేశ్‌, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవిందర్‌రావు, పిన్నింటి అనిల్‌రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

● జయశంకర్‌ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌, చల్లూరి మధుతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్‌, లకావత్‌ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు.

● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్‌గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్‌, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, బాదం ప్రవీణ్‌ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

● మహబూబాబాద్‌లో ఇప్పుడున్న జె.భరత్‌చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్‌ రాధతో పాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి.

● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్‌లు, ఇన్‌చార్జ్‌ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్‌ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

నేడు జిల్లాకు పరిశీలకులు..

జనగామ: జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు, టీపీసీసీ ప్రతినిధి శనివారం జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి శాసన, పార్లమెంట్‌ సభ్యులు, మండల, అనుబంధ కమిటీలు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ కమిటీ, పీఏసీఎస్‌ఎస్‌, దేవస్థాన కమిటీ చైర్మన్లు, తాజా, మాజీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరై ఆసక్తి ఉన్న నాయకులు డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ మెంబర్లతో ముఖాముఖి అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ఈ నెల11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో జనగామ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటలకు పాలకుర్తి పట్టణ కేంద్రంలో ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. అభిప్రాయ సేకరణలో డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement