కోరుట్ల: ఇంటి నిర్మాణం చేపడితే చాలు.. తనకు రూ.లక్షల్లో కాసులు ఇవ్వాల్సిందేనని మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్ వేధిస్తున్నారని, లేకుంటే టౌన్ప్లానింగ్ అధికారులను పంపి తమ ఇళ్లు కూలుస్తున్నారని 24,32వ వార్డులకు చెందిన బాధితులు జాప లక్ష్మన్, జాప రమేశ్, సునీత, అనిత, నరేందర్ ఆరోపించారు. మాజీ చైర్మన్ తీరుకు నిరసనగా కూల్చివేసిన ఇళ్ల వద్ద శుక్రవారం బాధితులు నిరసన తెలిపారు. శీలం వేణుగోపాల్ తనను రూ.20 లక్షలు డిమాండ్ చేశారని, తాను నిరాకరించడంతో తన ఇల్లు కూల్చివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టారని ఆరోపించారు. లంచాలు ఇవ్వకుంటే అనవసరమైన నిబంధనల పేరు చెప్పి ఇళ్లు కూల్చాలని టౌన్ప్లానింగ్ అధికారులపై వేణుగోపాల్, ఆయన భార్య కౌన్సిలర్ శీలం జయలక్ష్మి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాగా, ఈ విషయమై మాజీ చైర్మన్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇళ్ల కూల్చివేత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించారని పేర్కొన్నారు.


