ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
జగిత్యాల: మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తి పన్నే ప్రధాన ఆదాయం. ఈ నిధుల ద్వారానే పారిశుధ్యంతోపాటు, వీధిదీపాల వంటి వసతులు కల్పిస్తారు. కార్మికులకు వేతనాలు ఇస్తుంటారు. కానీ ఆస్తిపన్ను వసూలు మాత్రం లక్ష్యం చేరడ లేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడురోజులే గడువు ఉంది. ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో బకాయి పడిన వారికి రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ చెల్లించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తుల జప్తునకు చర్యలు చేపడతారు.
రెడ్ నోటీసులు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. అతిపెద్ద బల్దియా అయిన జగిత్యాలలోనే అధికమొత్తంలో బకాయిలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను వదిలేసినా ప్రైవేటు బిల్డింగ్ యజమానులే ఒక్కొక్కరు రూ.13 లక్షల నుంచి రూ.15లక్షలకు పైగా బకాయి ఉన్నారు. ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నా.. చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈనెల 31లోపు చెల్లించకుంటే ఆస్తులు జప్తుచేస్తామని బల్దియా అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
వసూలయ్యేనా..?
అధికారుల ఉదాసీనతా..? ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణమో తెలియదుగానీ జిల్లాకేంద్రమైన జగిత్యాల బల్దియాలోనే ఆస్తిపన్ను తక్కువ శాతం నమోదైంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. అయినా ఇప్పటివరకు వసూళ్లు సగానికి కూడా చేరుకోలేదు. జగిత్యాలలో డిమాండ్ రూ.1401.31 కోట్లు. వసూలైంది మాత్రం రూ.685.73 కోట్లు. మొదటి స్థానంలో కోరుట్ల బల్దియా ఉంది. ఇక్కడ రూ.570.02 కోట్ల డిమాండ్కు రూ.515.80 కోట్లు వసూలైంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అధికారులు వసూళ్ల కోసం హడావుడి చేయడమే తప్ప గడుపులోపు పూర్తయింది ఎప్పూడూ లేదు. ఈనెల 31లోపు వందశాతం వసూలు అయితేనే కేంద్రప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది.
బల్దియా ఇళ్లు డిమాండ్ వసూలు (రూ.కోట్లలో)
జగిత్యాల 27,877 14 685.73
కోరుట్ల 19,714 5.70 515.80
మెట్పల్లి 13,823 4.78 387.12
ధర్మపురి 4,849 1.85 74.36
రాయికల్ 5,527 1.34 101.72
మొత్తం 71,790 27.69 17.64.73
లక్ష్యం చేరని ఆస్తి పన్ను వసూళ్లు
చెల్లించకుంటే రెడ్ నోటీసులు జారీ
జప్తు చేసేందుకు ప్రత్యేక వాహనాలు


