రాయికల్: రాయికల్ మండలంలోని అయోధ్యలో 39ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడకు వచ్చాడని, అందుకే గ్రామంలో కోదండ రామాలయం నిర్మించామని ప్రజలు చెబుతుంటారు. అయోధ్యతోపాటు ఉప్పుమడుగు గ్రామాలు కలిసి ఉంటాయి. కాలక్రమేణా రెండు గ్రామాల ప్రజలు కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. 1987లో ఇరుగ్రామాల ప్రజలు శ్రమదానంతో గ్రామంలో శ్రీకోదండరామాలయాన్ని నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఆలయ కమిటీలో ఇరుగ్రామాల ప్రజలు పాల్గొని ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడి వద్దకు ఉప్పుమడుగు నుంచి సీతమ్మ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి నవమి రోజు కల్యాణం చేస్తారు. కల్యాణానికి ప్రభుత్వం తరఫున తహసీల్దార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈనెల 27న (శుక్రవారం) శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు అంగడి భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. 27న శ్రీసీతారాముల విగ్రహాలను ఎదుర్కొని వచ్చి 11.28 గంటలకు కల్యాణం జరిపించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.


