వందశాతం ఆస్తి పన్ను వసూలుపై బల్దియా దృష్టి 85శాతం వసూళ్లతో జిల్లాలోనే మొదటిస్థానం లక్ష్యం చేరితే దక్కనున్న కేంద్రప్రభుత్వ గ్రాంటు
కోరుట్ల: ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.మూడు కోట్లు నిధులు. నిధుల లేమితో విలవిలాడుతున్న మున్సిపాలిటీలకు జీవం పోసే అవకాశం. దీనిని వినియోగించుకోవాలని జిల్లాలోని ఐదు బల్దియాలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నా.. నిధులు అందుకునే అవకాశం కేవలం కోరుట్లకే దక్కనుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆస్తి పన్ను వసూళ్లలో బల్దియా రాష్ట్రస్థాయిలో మూడో స్థానం.. జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండడం. వందశాతం లక్ష్యం చేరితే కేంద్రం రూ.3 కోట్ల గ్రాంట్ అందించనుంది.
జిల్లాలో టాప్..
బల్దియాల్లో ఆస్తి పన్ను వసూళ్లకు ఈనెల 31వరకు అవకాశం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఐదు బల్దియాల్లో కోరుట్ల మొదటిస్థానంలోనే కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం రూ.5.70 కోట్ట ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా కాగా.. ఇప్పటివరకు రూ.5.05 కోట్ల వసూళ్లయ్యాయి. ఈ లెక్కన 89.52 శాతానికి చేరుకుంది. మరో వారం రోజులు అవకాశం ఉన్న క్రమంలో వంద శాతం చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ప్రకారం కోరుట్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ రూ.3 కోట్లు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి.
ధర్మపురి పూర్..
కోరుట్ల 89.52శాతం వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా.. ధర్మపురి 37 శాతంతో కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన జగిత్యాలది కేవలం 45శాతమే. రాయికల్ మున్సిపాలిటీ 72 శాతంతో మెరుగైన స్థితిలోఉంది. మెట్పల్లిలో 77.50 శాతం పన్నుల వసూలు అయ్యాయి.
కోరుట్లలో సమష్టి కృషి..
కోరుట్ల మున్సిపాలిటీలో కమిషనర్ రవీందర్, ఉద్యోగులు సమష్టి కృషితో పనిచేయడం కలిసొచ్చింది. ఉద్యోగులు పట్టుదలతో పండుగల సమయంలోనూ ఆస్తి పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఉద్యోగుల కృషి ఫలితంగా బల్దియా వందశాతం వసూళ్లకు చేరుకుంటే కేంద్ర నుంచి రూ.3 కోట్ల గ్రాంట్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ కింద నిధులు వచ్చే అవకాశాలున్నాయి.


