జగిత్యాలజోన్: జగిత్యాలకు చెందిన నలమాసు ఓంకార్ రసాయనశాస్త్రంలో అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, ఇంజినీరింగ్ రసాయనశాస్త్ర విభాగంలో వివిధ దేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు ఎంపిక కాగా.. వారిలో ఓంకార్ ఒకరు. భారీ పరిశ్రమలకు అవసరమైన పరికరాల రూపకల్పన, తయారీలో ఓంకార్ సిద్ధహస్తులు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పీహెచ్డీ పట్టా పొందిన ఓంకార్.. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో ఎటీఅండ్ టిబెల్ పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. కాలిఫోర్నియాలో అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. చైనా, కెనడ, దక్షిణకొరియా, జపాన్ దేశాల రసాయన శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. దాదాపు 200 పరిశోధన వ్యాసాలను వివిధ అంతర్జాతీయ పత్రికలకు రాయడం విశేషం. అంతర్జాతీయ అవార్డు పొందడంపై ఓంకార్ శ్రేయాభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.
జగిత్యాలలోనే విద్యాభ్యాసం
జగిత్యాలలో పదో తరగతి వరకు చదివిన ఓంకార్.. సిద్దిపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ఇంటర్మీడియట్ చదివారు. కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో బీఎస్సీ చదివిన సమయంలో అప్పటి తెలుగు అకాడమీ డైరెక్టర్ వి.కొండల్రావు చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసారు.


