చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా చేపట్టాలి
జగిత్యాల: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తిగా పారదర్శకంగా.. నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికుముదిని అన్నారు. సోమవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. శాంతిభద్రతకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎన్నిక ప్రక్రియలో భాగంగా కౌన్సిలర్లకు, ఎక్స్అఫిషియో సభ్యులకు ముందుగానే సమాచారం అందించాలని, పోలింగ్, లెక్కింపు ఫలితాల ప్రకటన వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. పరోక్ష విధానం ద్వారా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎక్స్అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. సెక్షన్ 5, 20 ప్రకారం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు తాము ఎన్నికై న 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిథ్యం వహించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.


