
రాజీకి వారధి లోక్ అదాలత్
కక్షిదారులకు సత్వర న్యాయం
కోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గింపు
20 నెలల్లో 14,778 కేసుల పరిష్కారం
నేడు జిల్లావ్యాప్తంగా మెగా లోక్ అదాలత్
జగిత్యాలజోన్: ‘ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడ్చాడు’ అనే సామెతను కోర్టు కేసులు ఎదుర్కొన్నవారు చెబుతుంటారు. కేసుల విచారణలో ఎనలేని జాప్యంతో కక్షిదారుల కు సత్వర న్యాయం దక్కడం లేదనే వాదన ఉంది. ఏడాదిలో కనీసం నాలుగైదు మెగా లోక్ అదాలత్లు నిర్వహించి, వీలైనన్ని కేసులు పరిష్కరించేందు కు న్యాయమూర్తులు, న్యాయవాదులు చొరవ చూ పుతున్నారు. శనివారం(నేడు) జిల్లావ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.
20 నెలలు.. 14,778 కేసుల పరిష్కారం
జిల్లాలోని అన్ని కోర్టుల్లో విచారణలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల్లో 14,778 కేసులకు 20 నెలల్లో లోక్అదాలత్ ద్వారా మోక్షం లభించింది. 2024లో 10,660 కేసులు, 2025లో ఇప్పటి వరకు 4,118 కేసులు పరిష్కరించారు. అయినా జిల్లాలోని అన్ని కోర్టుల్లో మరో 18వేల కేసులు పెండింగ్లో ఉన్నా యి. శనివారం నాటి లోక్ అదాలత్లో రాజీకి అనుకూలమైన కేసులు 8,697 ఉండగా, 3వేలకు పైగా కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రిమినల్ కేసుల్లో 865, మనీ రికవరీ కేసుల్లో 51, దంపతులకు సంబంధించినవి 31 కేసులు, 316 సివిల్ కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ– పెట్టి కేసులు, చెక్బౌన్స్ కేసులు పరిష్కరించనున్నారు. జిల్లాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కో ర్టులు లేవు. జడ్జిల నియామకం పెద్దగా జరగడం లే దు. దీంతో చిన్న విషయంలో కోర్టుకు వెళ్లినా పరి ష్కారానికి ఏళ్లసమయం పడుతోంది. ఒక కేసులో దాదాపు 15 నుంచి 20మందిని విచారించి తీర్పులు చెప్పడం జడ్జిలకు కష్టసాధ్యంగా మారుతోంది.
లోక్ అదాలత్కు అధిక ప్రాధాన్యం
లోక్ అదాలత్ల్లో రాజీ చేసుకోదగ్గ అన్ని రకాల కేసులు పరిష్కరిస్తున్నారు. ఇరువర్గాలకు రాజీమార్గంలో నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకో సం మధ్యవర్తిత్వ బెంచ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. లోక్ అదాలత్ తీర్పులు సుప్రీం కోర్టు తీర్పుతో సమానం. ఒక్కసారి లోక్ అదాలత్లో రాజీ చే సుకున్న తర్వాత మళ్లీ ఎక్కడికెళ్లినా చెల్లదు. ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. లోక్ అదాలత్పై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.