
అను‘మతి’లేని ల్యాబ్లు
● నిర్వాహకుల ఇష్టారాజ్యం ● ప్రజల ప్రాణాలతో చెలగాటం ● అందినంతా దోపిడీ ● జిల్లాకేంద్రంలో రెండు ల్యాబ్లు సీజ్
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్లో గల ఓ ల్యాబ్పై వైద్యశాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో దానిని సీజ్ చేశారు. అనుమతి తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నోటీసులు ఇచ్చారు.
వాతావరణంలో వస్తున్న మార్పులతో చాలామంది వైరల్ జ్వారాల బారిన పడుతున్నారు. దీనిని ఆసరగా చేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు వివిధ రకాల టెస్ట్లతో దోపిడీ చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్లు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ల్యాబ్లు ఏర్పాటు చేసుకుని అందినంతా దోచుకుంటున్నా రు. ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్య శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. కానీ నిబంధనలకు విరుద్ధంగా గల్లీకో రక్తపరీక్ష కేంద్రాలు వెలిశాయి. చిన్నపాటి శిక్షణ పొందుతూ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.
ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే..
వాస్తవానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే గది సుమారు 100 స్క్వైర్ ఫీట్స్ ఉండాలి. పరికరాలు ఉండాలి. ల్యాబ్లో ఎంబీబీఎస్ డాక్టర్తోపాటు పాథాలజిస్ట్, టెక్నిషియన్స్, మైక్రోబయాలజిస్ట్ ఉండాలి. జిల్లాలోని కొన్ని ల్యాబ్లలో వీరు ఎక్కడా కనిపించరు. రోగికి చేసే పరీక్షల్లోనూ ప్రమాణాలు పాటించడం లేదు. కిట్లలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
గల్లీకొకటి..
జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ల్యాబ్లు, రక్త పరీక్ష కేంద్రాలు ఇష్టారాజ్యంగా వెలిశాయి. మొత్తంగా 500కు పైగానే ఉంటాయని అంచనా. ఎలాంటి అర్హత లేకున్నా.. అనుమతి లేకుండానే కొన్ని ఏర్పాటు చేశారు. చిన్నపాటి మెట్ల సందులు, చిన్నచిన్న షటర్లలో వీటిని ఏర్పాటు చేశారు.
దోపిడే వారి పని
కొన్ని ఆస్పత్రులకు అనుసంధానంగా ల్యాబ్లు లేవు. దీంతో రోగులు ఇలాంటి ల్యాబ్కు వెళ్తున్నారు. అక్కడ వీరికి రక్తపరీక్ష, మూత్రపరీక్ష చేస్తూ దాదాపు రూ.1500 నుంచి రూ.3000 వరకు వసూలు చేస్తున్నారు. రూ.100కు చేయాల్సిన పరీక్షకు రూ.500 వరకు బిల్లు వేస్తున్నారు. ఈ రిపోర్టుల్లోనూ అనేక తప్పులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలున్నాయి.
అనుమతి ఉన్నవి నాలుగే
జిల్లా కేంద్రంలో అన్ని నిబంధనలతో కూడిన ల్యాబ్లు నాలుగు మాత్రమే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో దాదాపు 500కు పైగా ల్యాబ్లు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం నర్సింగ్హోంలకు మాత్రమే అనుబంధంగా ల్యాబ్లుంటాయి. కానీ ఇక్కడ ఎక్కబడితే అక్కడ ఏర్పాటు చేశారు.
ఆఫర్ల పేరిట దోపిడీ
రక్త పరీక్ష, మూత్రపరీక్షలే కాకుండా వివిధ రకాల పరీక్షలు చేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. థైరాయిడ్, కిడ్నీ, లివర్, లిపిడ్ పరీక్షలకు రూ.450, రూ.200కే చేస్తామంటూ బోర్డులు తలిగిస్తున్నారు. అంతేకాకుండా రూ.వెయ్యికే 50 రకాల టెస్ట్లు అంటూ మభ్యపెడుతున్నారు.
విదేశాలకు వెళ్లే వారికీ చెకప్
జిల్లా నుంచి అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. వీరికి మెడికల్ రిపోర్ట్స్ తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకున్న ల్యాబ్ నిర్వాహకులు విదేశాలకు వెళ్లే వారికి పరీక్షలు చేస్తూ అన్నీ బాగానే ఉన్నట్లు రిపోర్ట్ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ల్యాబ్కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎంబీబీఎస్ డాక్టర్, పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్ ఉండాలి. ఎక్కపడితే అక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయకూడదు. వైద్యశాఖ అనుమతి ఉండాలి. పరికరాలు అన్నింటిని ఏర్పాటు చేయాలి. కొన్నింటిని సీజ్ చేశాం. మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో

అను‘మతి’లేని ల్యాబ్లు