
కక్షిదారులతో రాజీ కుదుర్చాలి
● ఎస్పీ అశోక్కుమార్
జగిత్యాలక్రైం: ఈనెల 13న జరిగే మెగాలోక్అదాలత్లో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్ తగాదాలు, ఆస్తివిభజన, కుటుంబపరమైనవి, నిర్వహణ కేసులు, వైవాహిక జీవితానివి, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్బౌన్స్, డ్రంకెన్డ్రైవ్, పెట్టీ కేసులను పరిష్కరించేందుకు ముందుకు రావాలని సూచించారు. న్యాయశాఖ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
చేప పిల్లల స్థానంలో నగదు బదిలీ చేయాలి
జగిత్యాలటౌన్: చేప పిల్లల పంపిణీలో లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని నగదు బదిలీ చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి సీఎంకు లేఖ రాశారు. చేపపిల్లల పంపిణీ కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారిందని, పిల్లలు చిన్నవిగా ఉండడం.. లెక్కల్లో వ్యత్యాసం వస్తోందన్నారు. దళారీ వ్యవస్థ కారణంగా రూ.కోట్లు వెచ్చిస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదన్నారు.
హెచ్ఐవీపై అవగాహన కల్పించాలి
జగిత్యాల: ప్రజలకు హెచ్ఐపీ అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని సంక్షేమ అధికారి కార్యాలయంలో సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లతో సమావేశమయ్యారు. గర్భిణులు, బాలింతలకు హెచ్ఐవీ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, హెచ్ఐవీ కో–ఆర్డినేటర్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్
జగిత్యాల: భీమారం మండలం ఏదులలింగంపేట గ్రామపంచాయతీ సెక్రటరీ పుష్పలతను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కారోబార్ రాజేశ్ను విధుల నుంచి తొలగించారు. ఇందిరమ్మ ఇళ్లకు నిధుల్లో రూ.లక్ష దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టి ఆర్డీవో నివేదిక ఆధారంగా సెక్రటరీని సస్పెండ్, కారోబార్ను తొలగించారు. జమ్మికుంట లావణ్యకు రావాల్సిన డబ్బులను జవ్వాజి లావణ్యకు బదలాయించడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలి
సారంగాపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి బి.నారాయణ అన్నారు. మంగళవారం సారంగాపూర్ కళాశాలను సందర్శించారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి నివాళి అర్పించారు. ఫేషియల్ రికగ్నైషన్ సిస్టం ద్వారా విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు నమోదు చేస్తోందన్నారు. ప్రిన్సిపల్ వై. రమేశ్బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కక్షిదారులతో రాజీ కుదుర్చాలి

కక్షిదారులతో రాజీ కుదుర్చాలి