
నీటి పారుదల శాఖలో టెం‘డర్’
● మెట్పల్లి మండలంలోని కృష్ణాద్రి చెరువు అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.39.42లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు రెండు నెలల క్రితం ఈ పనులకు టెండర్లు నిర్వహించింది. పలువురు కాంట్రాక్టర్లు పాల్గొని షెడ్యూళ్లు దాఖలు చేశారు. పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్.. అగ్రిమెంట్ చేసుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. బిల్లులు సకాలంలో వస్తాయో..? లేదో..? అనే సందేహంతో సదరు కాంట్రాక్టర్ ఆసక్తి చూపడం లేదని తెలిసింది.
● మెట్పల్లి మండలంలోని రాంలచ్చక్కపేటలోని మాదిగ కుంట అభివృద్ధి పనులదీ ఇదే పరిస్థితి. రూ.12.53లక్షలతో చేపట్టే ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండు నెలలుగా అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. ఇతను కూడా బిల్లులపై అనుమానంతోనే ముందుకు రావడం లేదని సమాచారం.
మెట్పల్లి: నీటి పారుదల శాఖలో అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. కొన్నింటిని టెండర్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకోకుండా జాప్యం చేస్తున్నారు. మరికొన్ని పనులకు పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఒక్కరు కూడా పాల్గొనలేదు. దీంతో ఆయా పనులను పూర్తి చేయించడం స్థానిక అధికారులకు ఇబ్బందిగా మారింది.
● కృష్ణాద్రి, మాదిగ కుంటలే కాకుండా ఇంకా పలు పనులు టెండర్ దశలోనే ఆగిపోయాయి.
● మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట పెద్ద చెరువుకు రూ.6.09లక్షలను కేటాయించారు. వీటిని దక్కించుకున్న కాంట్రాక్టర్..అగ్రిమెంట్ చేసుకోవడంపై అసక్తి చూపడం లేదు.
● మెట్పల్లి మండలంలోని డీ–29 ఉప కాల్వలో షట్టర్ల మరమ్మతుకు రూ.4.99లక్షలు మంజూరు కాగా.. ఇప్పటివరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచారు.
● మేడిపల్లి మండలంలోని డీ–49 ఉప కాల్వలో రూ.2లక్షలతో చేపట్టే మరమ్మతు పనులకు మూడుసార్లు టెండర్లు నిర్వహించారు.