
భారత్పై ట్రంప్ గరం గరం
ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోంది
మేము సుంకాలు భారీగా పెంచడంతో వెనక్కి తగ్గింది
టారిఫ్ల వల్లే ఇతర దేశాలతో బేరమాడే శక్తి పెరిగింది
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ అత్యధిక టారిఫ్లతో అమెరికాను చంపుతోందని మండిపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాతోపాటు చైనా, బ్రెజిల్లు భారీగా టారిఫ్లు విధిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన తాజాగా స్కాట్ జెన్సింగ్స్ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు.
అమెరికా ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి టారిఫ్లు విధించబోమంటూ ఇండియా తమకు ఆఫర్ ఇచి్చందని అన్నారు. భారతదేశ ఉత్పత్తులపై తాము టారిఫ్లు భారీగా పెంచాం కాబట్టి అలాంటి ఆఫర్ వచ్చిందని, లేకపోతే వచ్చేదేకాదని తేలి్చచెప్పారు. కాబట్టి ఇండియాపై టారిఫ్లు వేయడంలో అన్యాయం ఏమీ లేదని పరోక్షంగా స్పష్టంచేశారు. తమ చర్యల వల్లే ఇతర దేశాలతో బేరమాడే శక్తి పెరిగిందని పేర్కొన్నారు.
భారత్–అమెరికా బంధం ఏకపక్షమే
భారత వాణిజ్య విధానాలను ట్రంప్ మరోసారి తప్పుపట్టారు. భారత్–అమెరికాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలన్నీ ఏకపక్ష బంధంగా అభివరి్ణంచారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఇండియాతో చాలా బాగా కలిసి పోయాం. కానీ, మా బంధం చాలా ఏళ్లుగా ఏకపక్ష బంధంగానే ఉంది. భారత్ అపారమైన సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై వందశాతం సుంకాలు విధించింది.
అందుకే ఇండియా నుంచి దిగుమతులు ఆపేశాం. వాణిజ్యం చేయడం లేదు. కానీ, ఇండియాకు అమెరికాలో భారీగా మార్కెట్ ఉంది. ఎందుకంటే ఇండియా నుంచి మేము మూర్ఖంగా సుంకాలు వసూలు చేయడం లేదు. వారు తయారు చేసిన ప్రతి వస్తువును అమెరికాకు పంపగలుగుతున్నారు. వారి ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. భారత్ వాణిజ్య విధానాలు అమెరికాలోని తయారీదారులకు భారీ నష్టాన్ని కలిగించాయి’’ అని ట్రంప్ ఆరోపించారు.
హార్లీ–డేవిడ్సన్ బైక్లు అమ్మలేకపోయాం
అమెరికాలో అత్యంత గుర్తింపు పొందిన మోటార్సైకిల్ బ్రాండ్లలో ఒకటైన హార్లీ–డేవిడ్సన్ భారత్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ట్రంప్ ప్రస్తావించారు. ‘హార్లీ–డేవిడ్సన్ బైక్లను భారత్లో అమ్మలేకపోయాం. మోటార్ సైకిల్పై 200 శాతం సుంకం విధించారు. దాంతో సుంకాలను తప్పించుకోవడానికి హార్లీ–డేవిడ్సన్ సంస్థ భారత్లోనే ప్లాంట్ నిర్మించాల్సి వచి్చంది. ఈ అన్యాయమైన సుంకాల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికా వెలుపల చేస్తున్నాయి. నేను అధికారంలోకి వచ్చాక ఈ వాణిజ్య విధానాలను తిప్పికొట్టడం ప్రారంభించా. అందులో భాగమే ఈ పరస్పర సుంకాలు’’ అని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు అమెరికా వైపే మొగ్గు
తమ నూతన విధానాలతో అనేక సంస్థలు అమెరికాలో కంపెనీలను, ప్లాంట్లను స్థాపించడానికి ముందుకు వస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. ‘‘మా వాణిజ్య విధానాల వల్ల కార్ల కంపెనీలు, ఏఐ సంస్థలు ఇప్పుడు అమెరికా వైపు మొగ్గుచూపుతున్నాయి. చైనా, మెక్సికో, కెనడా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్న అనేక కార్ల కంపెనీలు ఇప్పుడు మా దేశంలోనే ఏర్పాటవుతున్నాయి. దానివల్ల ఆయా కంపెనీలపై సుంకాల మోత తప్పుతోంది. వాటికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది’’ అని ట్రంప్ తెలిపారు.
ఏడు యుద్ధాలను ఆపేశా..
ప్రపంచ యుద్ధాలను ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ట్రంప్ మరోమారు అదే విషయం చెప్పారు. తన వాణిజ్య విధానాలతో ఏడు యుద్ధాలను పరిష్కరించానని స్పష్టంచేశారు. ‘‘సుంకాల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఏడు యుద్ధాలను పరిష్కరించడానికి సహాయపడింది. అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. టారిఫ్లు మా దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మార్చాయి. ఈ టారిఫ్లతోనే ఏడు యుద్ధాలను ఆపాను’’ అని వ్యాఖ్యానించారు.
అవన్నీవదంతులు..
తన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ‘‘మీరు చనిపోయారంటూ వార్తలు మీ దృష్టికి వచ్చాయా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. తన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నానని తెలిపారు. అవి కూడా పుకార్లేనని ఖండించారు. తాను చాలా చురుగ్గా ఉన్నానని, ముందే చెప్పినట్టుగా ఇప్పుడున్నంత ఆరోగ్యంగా మరెప్పుడూ లేనని స్పష్టం చేశారు.