అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్హౌస్లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
ఇరాన్- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.
ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్లో అమర్చిన ల్యాండ్మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. . ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు.


