షాంగ్సీ: చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్లో ఉన్న లియుషెన్యు బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మృతిచెందారు. గనిలో చిక్కుకున్న 38 మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నది. శుక్రవారం రాత్రి 7:29 గంటలకు షాంగ్సీ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో భూగర్భంలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు శనివారం ఉదయం 6 గంటల సమయానికి 201 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, ఎనిమిది మంది అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు
సహాయక చర్యల్లో ఉత్కంఠ
ప్రస్తుతం మరో 38 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గనిలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోవడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. కొందరు చిక్కుకున్న కార్మికులు అత్యంత విషమ స్థితిలో ఉన్నట్లు సమాచారం అందడంతో, వారిని కాపాడటానికి రక్షణ బృందాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయి.
చైనా ప్రభుత్వ స్పందన
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకున్న వారిని కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని ఆయన తెలిపారు. బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా పేరుగాంచిన షాంగ్సీలో జరిగిన ఈ ఘటన, గనుల్లో భద్రతా లోపాలపై మరోసారి చర్చకు దారితీసింది.


