వింబర్లీ: అమెరికాలోని టెక్సాస్లో చిన్న విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఆస్టిన్కు 64 కిలోమీటర్ల దూరంలోని వింబర్లీ వద్ద గురువారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన సెస్నా 421సీ రకం విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు హేస్ కౌంటీ జడ్జి రుబెన్ బెసెర్రా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించలేదు. ప్రమాదానికి ముందు ఆ విమానం చాలా వేగంతో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. అదే మార్గంలో ప్రయాణించిన మరో విమానం సమీపంలోని శాన్ ఆంటోనియోలో సురక్షితంగా ల్యాండైనట్లు వెల్లడించారు.
ఈ విమానం టెక్సాస్ పాన్హ్యాండిల్లోని అమరిల్లో సమీపంలోని విమానాశ్రయం నుండి బయలుదేరి.. న్యూ బ్రాన్ఫెల్స్లో దిగాల్సి ఉంది. అమరిల్లోకి చెందిన ఒక పికిల్బాల్ క్రీడా బృందం టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందని.. వర్షం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, తెల్లవారుజామున 3 గంటల నుండి వర్షం కురవడంతో దర్యాప్తు బృందాలకు సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి.


