భారత్పై దాడులనుద్దేశించి పాక్ మంత్రి వాచాలత్వం
లాహోర్: రెచ్చగొట్టేలా మాట్లాడటమే పనిగా పెట్టుకునే పాకిస్తాన్ మంత్రులు మరోసారి తమ వాచాలత్వాన్ని బయటపెట్టుకున్నారు. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖావాజా ఆసిఫ్ శనివారం ఇదే తరహా ప్రేలాపనలు చేశారు. ‘‘తప్పుడు ఆపరేషన్ల పేరిట భారత్ మాపై దాడికి దిగితే ఈసారి మేం దాడుల పరిధికి కోల్కతా దాకా విస్తరిస్తాం. కోల్కతాపై దాడిచేయగలం’’అని అన్నారు. శనివారం లాహర్ సమీప సొంత పట్టణం సియాల్కోట్లో ఆసిఫ్ మాట్లాడారు.
‘‘భారత ప్రభుత్వం తప్పుడు కథనాలు అల్లుతుంది. ఇందుకోసం సొంత వాళ్లను లేదా అక్కడి నిర్బంధంలో ఉన్న పాకిస్తానీలను వాడుకుంటోంది. కొందరిని నేలపై పడుకోబెట్టి ‘వీళ్లందరూ ఉగ్రవాదులు. అందర్నీ అంతంచేశాం’అంటూ ఏవేవో కథనాలు వెలువరుస్తుంది’’అని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ఉద్రికత్తలను సాకుగా చూపి పొరుగుదేశం దాడులకు తెగబడితే తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని భారత రక్షణమంత్రి రాజ్నాథ్ పాక్నుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఆసిఫ్ మాట్లాడారు.


