ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ నేటి నుంచి (ఏప్రిల్ 7) రాత్రి 8 గంటలకే మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
యుద్ధం వల్ల పెరుగుతున్న ప్రపంచ ఇంధన ఖర్చులకు ప్రతిస్పందనగా పొదుపు చర్యల్లో భాగంగా పాక్ నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్కు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పీఎంవో ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్, ఇస్లామాబాద్, పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్లు, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేస్తారు. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వాలో డివిజనల్ హెడ్క్వార్టర్స్ ప్రాంతాల్లో మార్కెట్లు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు.
అలాగే.. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తిగత నివాసాల్లో జరిగే వివాహ కార్యక్రమాలు కూడా రాత్రి 10 గంటలలోపే ముగించాలి. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.
పశ్చిమాసియా ఘర్షణల వల్ల సరఫరా గొలుసులు దెబ్బతినడంతో పెరుగుతున్న ప్రపంచ చమురు, ఎనర్జీ ధరలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.


