ఇజ్రాయెల్‌ దాడుల్లో 44 మంది మృతి  | Israeli attacks kill at least 44 in Gaza as hunger crisis deepens | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడుల్లో 44 మంది మృతి 

May 31 2025 1:05 AM | Updated on May 31 2025 1:05 AM

Israeli attacks kill at least 44 in Gaza as hunger crisis deepens

డెయిర్‌ అల్‌ బలాహ్‌: గాజాపై ఇజ్రాయెల్‌ తాజా దాడుల్లో 44 మంది మరణించారు. అల్‌–బురైజ్‌లో ఒక్కఇంటిలోనే ఏకంగా 23 మంది మరణించారు. దక్షిణ గాజాలోని అమెరికా సహాయ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్‌ కాల్పుల్లో ఇద్దరు మరణించగా చాలామంది గాయపడ్డారు. హమాస్‌కు సహాయ సామగ్రి అందకుండా చేసేందుకు అమెరికా మద్దతుతో గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (జీహెచ్‌ఎఫ్‌) ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 

దీన్ని ఐరాసతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ అన్ని నైతిక, చట్ట పరమైన హద్దులు దాటుతోందని జోర్డాన్‌ మండిపడింది. ఒక సంచి పిండి కోసం కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజా అంతటా డజన్ల కొద్దీ ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ పేర్కొంది. 

ఇంకా ఆకలి కేకలే 
రెండు నెలల పై చిలుకుకు దిగ్బంధం తర్వాత గాజాలోకి ఇప్పుడిప్పుడే మానవతా సాయం చేరుతోంది. ఇజ్రాయెల్‌ పరిమిత అనుమతితో ట్రక్కులు గాజాలోకి ప్రవేశిస్తున్నట్టు ఐరాసలో ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ భద్రతా మండలికి తెలిపారు. దాని పంపిణీకి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఐరాస తెలిపింది. అయినా గాజాలో ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. 

విరమణకు మరో ప్రతిపాదన 
గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ మరోసారి కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం హమాస్‌ తన వద్ద సజీవంగా ఉన్న 10 మంది ఇజ్రాయెలీ బందీలను అప్పగించాలి. 18 మంది బందీల మృతదేహాలను రెండు దశల్లో ఇజ్రాయెల్‌కు ఇవ్వాలి. బదులుగా ఇజ్రాయెల్‌ 60 రోజుల కాల్పుల విరమణ పాటిస్తుంది. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement