అరాద్, డిమోనా నగరాలపై ఇరాన్ దాడులు
నతాంజ్ అణు కేంద్రంపై దాడికి ప్రతీకారం
అడ్డుకోవడంలో విఫలమైన ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్
180 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైనా ఇరాన్ దాడులు
ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బొల్లా తీవ్ర దాడులు, ఒకరి మృతి
దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు నానాటికీ విస్తరిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బోల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్పై విరుచుకుపడింది.
నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, డిమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. వందల కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం గమనార్హం. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అరాద్లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తామని తేల్చిచెప్పారు.
అంతర్జాతీయ సమాజం తమకు సహకరించాలని కోరారు. తద్వారా యుద్ధం మరింత తీవ్రతరం కావడం తథ్యమని సంకేతాలిచ్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని ఎలా రాగలిగాయన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్లో వైమానిక దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్లో సైరన్ల మోతలు వినిపించాయి.
టెల్ అవీవ్పై క్షిపణి దాడులు
సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బోల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వసం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్కు ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బోల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇజ్రాయెల్లో కీలక నగరం టెల్ అవీవ్పై ఇరాన్ ఆదివారం బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. హార్మూజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియే చమురు నౌకలు ఉన్నాయి.
ప్రపంచానికి పెనుముప్పు ఇరాన్: నెతన్యాహు
ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం ఆరోపించారు. డీగో గార్సియా దీవిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైనా దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి రెండు పట్టణాలపై దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ జనావాసాలను ఇరాన్ టార్గెట్ చేసిందన్నారు. ప్రజలను హత్య చేయాలన్నదే ఇరాన్ అసలు ఉద్దేశమని విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని వ్యాఖ్యానించారు.
హార్మూజ్ను తెరవకుంటే వినాశనమే: ట్రంప్
హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు.
తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు.
గల్ఫ్ వ్యవస్థలను నేలమట్టం చేస్తాం: ఇరాన్
హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు.
తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు.
అమెరికా ఎఫ్–15నూ కూల్చేశాం: ఇరాన్
ముంబై: తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం ఎఫ్–15ను హార్మూజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సురేట్ జనరల్ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘శత్రువుల ఎఫ్–15 ఫైటర్జెట్ మా గగనతలంలోకి ప్రవేశించి మా గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఆ విమానం పనిపట్టాయి.
చివరకు అది నేలకూలింది’’ అని ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే విమానం పూర్తిగా ధ్వంసమైందా? పైలట్ చనిపోయాడా? వంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఎఫ్–35 యుద్ధ విమానం మీద సైతం ఇరాన్ దాడి చేసింది. దీంతో అది వెనువెంటనే పశ్చిమాసి యాలోని స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్ గగనతలంపై ఎప్పుడంటే అప్పుడు మేం విమానాలను చక్కర్లు కొట్టించగలం అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆరోజు ఎఫ్–35ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.


