ఆస్పత్రిపై క్షిపణుల దాడి  | Iranian missile hits Beersheba hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిపై క్షిపణుల దాడి 

Jun 20 2025 4:16 AM | Updated on Jun 20 2025 4:16 AM

Iranian missile hits Beersheba hospital

దక్షిణ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర బాంబుల వర్షం 

క్షిపణుల దాడిలో ఆస్పత్రిలో 80 మందికి గాయాలు 

ప్రతిగా ఇరాన్‌ అరాక్‌ భారజల రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ దాడి 

మరింత విస్తరిస్తున్న యుద్ధం ఇరాన్‌లో 639కి చేరిన మరణాల సంఖ్య 

యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అనేది 2 వారాల్లో చెప్తామన్న వైట్‌హౌస్‌

బీర్‌షెబా/టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/దుబాయ్‌/వాషింగ్టన్‌: అంతూదరీ లేకుండా భీకరంగా కొనసాగుతూ పశ్చిమాసియా శాంతిదీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధజ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. 

వాటిల్లో కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్‌లోనే అత్యంత పెద్ద ఆస్పత్రి అయిన బీర్‌షెబా నగరంలోని వేయి పడకల సొరొక ఆస్పత్రిపై పడ్డాయి. క్షిపణుల ధాటికి ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. మంటలు అంటుకుని, అగి్నకీలలు ఎగసిపడుతున్న భవనం నుంచి రోగులను సహాయక బృందాలు స్ట్రెచర్‌లపై బయటకు తీసుకొస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.

 ఆస్పత్రిపై దాడి జరగబోతోందని సైరన్లు వినిపించడంతో చాలా మంది ముందుగానే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆస్పత్రిలో కొంతభాగాన్ని ఒకరోజు ముందే ఖాళీచేయించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆస్పత్రిలో 700 మంది రోగులున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్‌ జరిపిన దాడుల్లో 270కిపైగా ఇజ్రాయెలీలు రక్తమోడారు. టెల్‌ అవీవ్, రమాత్‌ గాన్, రెహోవోత్‌ సిటీ సహా పలు నగరాలపైనా ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. పలు భవనాలు పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్‌ టీవీచానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. 

సిటీలోని గవ్‌యమ్‌ నెగెవ్‌ ఇజ్రాయెల్‌ సైనిక నిఘా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోగా పొరపాటున ఆస్పత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్లజూస్తోందని, ఇందుకు ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు. ‘‘మాకు అమెరికా సాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అమెరికాకు ఏది అత్యుత్తమమో అదే ట్రంప్‌ చేస్తారు’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనేదానిపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం ప్రకటించింది. చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్‌ భావిస్తున్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ చెప్పారు. 

ప్లుటోనియం చిక్కకుండా దాడులు 
ప్రస్తుతం క్రియాశీలంగా లేని ఇరాన్‌లోని ఖోŠన్‌దాబ్‌ పట్టణ సమీపంలోని అరాక్‌ భారజల రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దాడులుచేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్‌ నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడలేదని ఇరాన్‌ తెలిపింది. అణురియాక్టర్లను చల్లబరిచేందుకు భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణురియాక్టర్లను చల్లబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ప్లుటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడుపదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90 శాతం శుద్ధ్దత స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. 

యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్‌ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరాన్‌కు అణుబాంబు తయారీలో ఈ ప్లుటోనియం అక్కరకొస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంలోనే అరాక్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులుచేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్‌లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్‌ ప్రయోగించిన 400కుపైగా క్షిపణుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు.  

అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధవిమానాలు 
అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు సాయం చేయాల్సి వస్తే ఇరాన్‌ ప్రతిదాడులు చేస్తుందన్న అంచనాతో అమెరికా యుద్ధవిమానాలను ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటుకు తరలించారు. ముఖ్యంగా ఖతార్‌లోని దోహాలో ఉన్న అల్‌ ఉదేయిద్‌ అమెరికా వైమానిక స్థావరంలోని సైనిక, ఆయుధ రవాణా విమానాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లను వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తోంది. తొలుత దాక్కుని తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహమని కొందరు యుద్ధనిపుణులు చెప్పారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేసియా, ఒమన్‌ తదతర దేశాలు తమ పౌరులను ఇరాన్‌ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement