టెహ్రాన్: ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం శాంతిచర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాలకు పలు విషయాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒప్పందం ఇంకా తుది దశకు చేరుకోలేదు. అయితే ఇరాన్లోని ఓ అంతర్గత గ్రూపు ఈ చర్చలు జరగకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి.
దీర్ఘకాలికంగా సాగుతున్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరుదేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్న తరుణంలో, ఇరాన్ అంతర్గతంగా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అమెరికాతో ఎలాంటి రాజీని ఇష్టపడని ఇరాన్లోని ఒక బలమైన మితవాద వర్గం ఈ ఒప్పందాన్ని ఎలాగైనా చెడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
పార్లమెంట్ సభ్యులు, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన ఈ కరడుగట్టిన మితవాద బృందం దేశంలో అమెరికాతో చర్చలు జరపవద్దంటూ వీధులలోకి వచ్చి నిరసనలు తెలపడం, మీడియాల చర్చలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.
గత శుక్రవారం రోజు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మితవాద శక్తులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. వీధుల్లో జెండాలు పట్టుకుని, అమెరికా, ఇజ్రాయెల్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖమేనీని చంపిన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని నినాదాలు ఇచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీపై ఈ బృందం విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ మాత్రం చర్చల బృందానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపాల్సిందేనని బృందానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది


