సింగపూర్లో ఉన్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు (18) ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ వద్ద చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అతడు వెండింగ్ మెషీన్ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్లోనే పెట్టాడు. తదుపరి వచ్చే కస్టమర్లరో ఒకరు ఆ స్ట్రాతోనే ఆరెంజ్ జ్యూస్ తాగే అవకాశం ఉంది.
వెండింగ్ మెషీన్ వద్ద ఆ కుర్రాడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్. ఏప్రిల్ 24న అభియోగాలు ఎదుర్కొన్నాడు. మార్చి 12న షాపింగ్ మాల్లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన అది వేగంగా వైరల్ అయింది.
అతడు క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్ కోసం పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చినట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ తెలిపింది.
మే 29న మళ్లీ కోర్టులో అతడు హాజరు కావాల్సి ఉంది. వెండింగ్ మెషీన్ వద్ద అతడు పాల్పడ్డ నేరానికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. జ్యూస్ వెండింగ్ మెషీన్ నిర్వహించే సంస్థ ఐజూజ్.. ఆ మెషీన్ను శుభ్రపరిచి, అందులో ఉన్న 500 స్ట్రాలను మార్చింది.


