అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏది చేసినా వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ప్రజల ఆగ్రహానికి గురౌవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్ను ఫ్రాడ్ జార్గా నియమించారు. అమెరికా ప్రభుత్వంలో పెద్దగా యాక్టివ్గా లేని జేడీ వాన్స్కు కావాలనే ఈ పదవి కట్టబెట్టారా? అనే చర్చ నడుస్తుంది.
అయితే సాధారణంగా అమెరికాలో ఉపాధ్యక్షుడు, మంత్రి వర్గంలో సభ్యునిగా ఉన్న వ్యక్తికి ఈ పదవిని ఇస్తూ ఉంటారు. విశ్వసనీయ రాజకీయ నాయకుడిగా ఉన్న వారికి కూడా ఈ పదవిని అప్పగిస్తారు. ఫెడరల్ స్థాయిలో మోసాలపై దర్యాప్తు, పర్యవేక్షణ, చర్యలు తీసుకునే అధికారం ఫ్రాడ్ జార్కే ఉంటాయి. ఇవి ప్రత్యేక బాధ్యతలుగా చెబుతూ ఉంటారు.
డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ను ఈ పదవిలో ప్రకటించడం వెనుక ఆంతర్యం రాజకీయపరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికాలో మోసపూర్వక లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రధానంగా డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడమేనని చర్చ నడుస్తోంది.
ఈ పదవిని వాన్స్కు ఇవ్వడం ద్వారా డెమోక్రాటిక్ రాష్ట్రాల్లో అవినీతి, మోసాలు ఎక్కువగా ఉన్నాయనే సందేశం పంపడమే కాకుండా, ఇది ఆయన మద్దతు దారులకు కూడా తాము అవినీతిని అరికడతామనే సంకేతాలు కూడా పంపినట్లయ్యింది.
ఇది వాన్స్కు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుంది, కానీ పార్టీ ఆధారిత లక్ష్యాలు ఉన్నాయనే విమర్శలు రావచ్చు.ట్రంప్ ప్రభుత్వానికి ఇది అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నామని బలమైన సంకేతం ఇవ్వొచ్చు కానీ రాజకీయ ఆయుధంగా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. డెమోక్రాటిక్ రాష్ట్రాలు ఇది ఫెడరల్ జోక్యంగా భావించి, చట్టపరమైన–రాజకీయ పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.


