భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా | China Closely Following India-Pakistan Situation | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా

Apr 28 2025 7:20 AM | Updated on Apr 28 2025 12:09 PM

China Closely Following India-Pakistan Situation

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.

తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్‌ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌, భారత్‌ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్‌ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్‌, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్‌ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్‌లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్‌ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్‌లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement