బంజారాహిల్స్: మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సుమారు నాలుగుకోట్ల రూపాయలు వసూలు చేసి, రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోవాలని నిందితులకు యువతి ఆఫర్ చేసింది. అయితే చివరికి ఆ ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు ఈ కేసును ఛేదించి యువతితోపాటు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంకు చెందిన పాయం మౌనిక(25) హైదరాబాద్లో నర్సు గా పనిచేస్తోంది. ఆమెకు హయత్నగర్కు చెందిన మోకురాల నిఖిల్(26)తో ఓ పబ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 9 నెలల సహజీవనం అనంతరం తనను మోసం చేశాడంటూ నిఖిల్పై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. నిఖిల్పై కేసు నమోదు కాగా, బెయిల్పై విడుదలయ్యాడు. నిఖిల్ వద్ద రూ.9 కోట్లు ఉన్నాయని, అందులో సగం వసూలు చేసి రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోండని పరిచయస్తులైన రౌడీషీటర్లకు ఆమె ఆశ చూపింది. నిఖిల్తోపాటు అతడి స్నేహితులు మహేశ్, సాయిశ్రీకాంత్లను కిడ్నాప్ చేయించి రూ.రూ.13.60 లక్షలు వసూలు చేసింది. సాయిశ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనికతోపాటు అంబర్పేట రౌడీషీటర్ అన్వర్ఖాన్(60), కాప్రాకు చెందిన సుంకరి ప్రసాద్రెడ్డి(56), జవహర్నగర్కు చెందిన మారెనేని రాజు(48), ఖమ్మంకు చెందిన కనకం సుధీర్, పోల్కంపల్లి నాగరాజు, అల్వాల్కు చెందిన జాన్లను పట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన కనకం మహేశ్, బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన చందు పరారీలో ఉన్నారు.
● మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో నిందితులకు యువతి ఆఫర్
● ప్రధాన నిందితురాలు సహా ఏడుగురి అరెస్టు.. పరారీలో ఇద్దరు


