
ముక్కు..నోరు మూసుకోవాల్సిందే!
మురుగుమయంగా కోఠి ఈఎన్టీ ఆస్పత్రి
ఆసుపత్రిలో పొంగిపొర్లుతున్న మురుగునీరు
సుల్తాన్బజార్: ఇప్పుడు కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్తే ముక్కు..నోరు మూసుకోవాల్సిందే. లేదంటే కంపు వాసనతో కడుపులో తిప్పడం ఖాయం. ఎందుకంటే ఆస్పత్రి ప్రాంగణంలో మురుగునీరు వరదలా మారి ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగునీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వెయ్యి మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందుతుంటారు. అయితే ఆసుపత్రిలోని క్యూలైన్ వద్ద, ఆసుపత్రి క్యాంటీన్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిల్వ ఉంటున్నది. ప్రభుత్వం పంపిణీ చేసే ఆహారం సైతం మురుగునీటిలోనే రోగులకు అందజేస్తుండడంతో దుర్వాసనతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. వారం రోజులుగా ఆసుపత్రిలో మురుగు నీరు ప్రవహిస్తుండడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం మూసీ నదిని తలపిస్తోంది.
డీఎంఈ దృష్టికి వెళ్లినా...
మురుగు నీటి దుర్గంధం కారణంగా ఆసుపత్రికి వచ్చే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు వస్తే కొత్త వ్యాధులు సోకుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు సైతం దుర్వాసన భరించలేక మాస్క్లు పెట్టుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం డీఎంఈ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రిని సందర్శించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పినా ఆసుపత్రి, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఈఎన్టీ ఆసుపత్రిలో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ నీరు
దుర్వాసనతో రోగుల బెంబేలు
వారం రోజులుగా ఇదే దుస్థితి
పట్టించుకోని ఆసుపత్రి, జీహెచ్ఎంసీ అధికారులు