
ఓయూ డిగ్రీ ఫలితాల్లో బాలికల హవా
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. గురువారం సాయంత్రం ప్రకటించిన డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ కోర్సుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్లో జరిగిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం రెగ్యులర్ కోర్సుల్లో వివిధ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 70 శాతం ఉత్తీర్ణత సాధించగా అందులో బాలికలు 79 శాతం, బాలురులు 60 శాతం పాసైనట్లు అధికారులు పేర్కొన్నారు. బీఏలో 1874 బాలికలు, 1294 బాలురులు మొత్తం 3168 మంది పాస్కాగా, బీకాంలో 14826 బాలికలు, 10312 బాలురులు మొత్తం 25138, బీఎస్సీలో 7468 బాలికలు, 1628 బాలురులు మొత్తం 9096, బీబీఏలో 3247 బాలికలు మొత్తం 6542 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరంలో మొత్తం 43,942 మంది పాసైనట్లు అధికారులు వివరించారు. ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు.
యువ క్రీడాకారుడుసాయివర్ధన్కు సత్కారం
సాక్షి, సిటీబ్యూరో: ఒలంపిక్స్లో పతాకం సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారుడు జవాజి సాయివర్ధన్కు భరోసా ఇచ్చారు. ఈ నెల 4 నుండి 15 వరకు బీహార్ రాష్ట్రంలోని రాజగిరిలో నిర్వహించిన జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ నేషనల్ గేమ్స్లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించి వెయిట్ లిఫ్టింగ్ 89 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన సాయివర్ధన్ గురువారం కలెక్టర్ను ఆయన ఛాంబర్లో కలిశారు. బంగారు పతకం సాధించినందుకు సాయి వర్ధన్కు అభినందనలు తెలిపి శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి సుధాకర్, అథ్లెట్ కోచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
రెయిన్బో ఆస్పత్రి చైర్మన్ పేరుతో సైబర్ మోసానికి యత్నం
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ పేరుతో అదే సంస్థకు చెందిన సీఎఫ్ఓకు రూ.20 లక్షలు పంపాలంటూ వాట్సప్ మెసేజ్ రాగా, ఆయన చాకచాక్యంగా వ్యవహరించి సైబర్ మోసానికి కళ్లెం వేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...బంజారాహిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ సీఎఫ్ఓ వికాస్ మహేశ్వరికి ఇటీవల సంస్థ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పేరుతో ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. తనకు రూ.20 లక్షలు పంపించాలని, ఓ బ్యాంక్ అకౌంట్ ఖాతాను కూడా పంపించాడు. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ రాంచీలోని కిషోర్గంజ్ బ్యాంక్ నుంచివచ్చింది. వాట్సప్ నెంబర్ కూడా తన చైర్మన్ది కాకపోవడంతో వికాస్ మహేశ్వరి లోతుగా ఆరాతీశాడు. బ్యాంక్ అకౌంట్తో పాటు తన చైర్మన్ ఫోన్ నెంబర్ కూడా వేరేగా ఉండటంతో అనుమానం వచ్చి వెంటనే రమేష్ కంచర్లకు ఫోన్ చేసి మీరు డబ్బులు పంపించాలని మెసేజ్ చేశారా? అని అడిగాడు. తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని ఆయన చెప్పడంతో ఇది సైబర్ మోసమని గ్రహించిన వికాస్ మహేశ్వరి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
● నాలుగు కోర్సుల్లో 70 శాతం ఉత్తీర్ణత
● 75 శాతం బాలికలు...60 శాతం బాలురు పాస్