
రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్కు ఫిర్యాదు పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మర్రి
అల్వాల్: ‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడి ఓటమికి పాటుపడ్డారు.. మిమ్మల్ని వదిలేది లేదంటూ..’ మల్కాజిగిరి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, ముఖ్యనేతలకు బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయి. దీంతో వారు మల్కాజిగిరి, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఫోన్నెంబర్తో ఈ బెదిరింపు ఫోన్కాల్స్ రావడంతో బీఆర్ఎస్ నేతలలో గందరగోళం ఏర్పడింది. ‘ఫోన్స్ కాల్స్ స్పూఫింగ్ యాప్’ ద్వారా ఆగంతకులు ఇలా బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘మైనంపల్లి హన్మంతరావు అన్ననే ఓడిస్తారా..మీ అంతు చూస్తాం వారం రోజులలో మిమ్మల్ని ఖతం చేస్తాం’ అంటూ నానా దుర్భాషలాడారని నేతలు వాపోయారు. పగలు రాత్రి తేడా లేకుండా పలుమార్లు కాల్స్ చేశారని చెప్పారు. బాధితులలో గౌతంనగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నేరేడ్మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్రెడ్డి, జవహర్నగర్ కార్పొరేటర్ ఏకే మురుగేష్, అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
రాచకొండ సీపీకి ఎమ్మెల్యే ఫిర్యాదు
తన ఫోన్ నెంబర్తో కొందరు ఆగంతకులు బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తన ఫిర్యాదును అందజేశారు. ఓటమిపాలైన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని ఆయన పోలీసులను కోరారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలకు ఆగంతకుల నుంచి బెదిరింపులు
మల్కాజిగిరి, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు
తన నెంబర్తో ఫోన్ కాల్స్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే మర్రి ఫిర్యాదు