● డీఎంహెచ్ఓ అప్పయ్య
హన్మకొండ అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మొబైల్ స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నా, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా 63000 30940 నంబర్కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందిస్తే రూ.50 వేలు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ప్రభుత్వ ప్రసూతి వైద్య నిపుణురాలు ప్రొఫెసర్ లక్ష్మి, పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వంశీకృష్ణ, మాతా–శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి రజిత, వైద్యులు కవిత, రుబీన, లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సీఈఓ తాళ్లూరి లత, డాన్ బాస్కో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈ.రాజు, పి.శారద, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకురాలు పద్మజ, సందీప్ ఉన్నారు.


