ఐనవోలు : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సుందరయ్య 41వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. లింగయ్య మాట్లాడుతూ.. ధనిక కుటుంబంలో పుట్టి తన పేరులోని రెడ్డిని తొలగించి సుందరయ్యగా మార్చుకున్న గొప్ప వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. చిన్న వయస్సులోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా, భూస్వాములు పాలేరులను దోపిడి చేస్తున్న తీరును చూసి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. దోపిడి సమాజం మారి సమసమాజ స్థాపనకు సుందరయ్య కృషి చేశారన్నారు. మండల కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, ఉప్పలయ్య, రామ్కుమార్, నాగరాజు, యాకయ్య, నర్సయ్య, గోపాల్, రాజిరెడ్డి, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
లారీలు పంపడంలో నిర్లక్ష్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఐనవోలు, ఒంటిమామిడిపల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు నారాయణరెడ్డి, ఉప్పలయ్య, రాంకుమార్, నాగరాజు, యాకయ్య, గోపాల్రావు, నర్సయ్య, వెంకన్న, రైతులతో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


